జన్మించినవానికి మరణము నిశ్చయము; మరణించినవానికి జన్మ నిశ్చయము. కావున, ఈ తప్పరాని విషయమున నీవు శోకింపఁదగదు.
వ్యాఖ్య: "జన్మించినవానికి మరణము నిశ్చయము; మరణించినవానికి జన్మ నిశ్చయము." పూర్వశ్లోకమును బట్టి, దేహముతో కూడిన జీవి నిత్యజన్మమరణములకు లోనైనదిగా భావించినను, అది శోకమునకు కారణము కాజాలదు. ఎందుకనగా, ఎవఁడు జన్మించినాడో వాఁడు మరణించక తప్పదు; ఎవఁడు మరణించినాడో వాఁడు మఱల జన్మించక తప్పదు.
"కావున, ఈ తప్పరాని విషయమున నీవు శోకింపఁదగదు." అట్లగుట, జన్మమరణప్రవాహమును ఎవఁడును నివారింపఁజాలఁడు; ఎందుకనగా దీనియందు ఎవ్వరికిని స్వల్పమైనను అధికారము లేదు. ఈ జన్మమరణప్రవాహము అనాదికాలమునుండి జరుగుచున్నది; శాశ్వతముగా జరుగుచుండును. ఈ దృష్టితో చూచినను నీవు శోకించుట యుచితము కాదు.
ఈ ధృతరాష్ట్రపుత్రులు జన్మించినవారు కావున వారు మరణించక తప్పదు. వారిని నీవు రక్షించు సాధనము నీకు లేదు. మరణించినవారు మఱల జన్మించక తప్పరు. దానిని కూడా నీవు ఆపఁజాలవు. అప్పుడు శోకించవలసినది ఏమున్నది? జరుగకూడనిది జరిగినప్పుడే శోకింపవలయును.
జరుగకూడనిది జరుగదు; జరగఁదగినదే జరుగును. ఉదాహరణకు, సూర్యుఁడు ఉదయించినచో నిత్యము అస్తమించక తప్పదనియు, అస్తమించినచో మఱల ఉదయించక తప్పదనియు అందఱికిని తెలియును. కావున సూర్యుఁడు అస్తమించినప్పుడు ప్రజలు శోకించరు లేక ఆందోళన చెందరు. అట్లే, ఓ అర్జునా! భీష్మద్రోణాది ప్రాణులు శరీరముతోపాటు మరణించునని నీవు భావించినచో, వారు శరీరముతోపాటే మఱల జన్మించుదురు. కావున ఈ దృష్టితో చూచినను శోకమునకు ఆస్పదము ఏమియు లేదు.
ఈ రెండు శ్లోకములలో (26, 27) భగవంతుఁడు తన సిద్ధాంతమును చెప్పలేదు. కావున "అథ చ" (అయితే ఒకవేళ) అని పేర్కొని, శరీరమును శరీరిగా భావించువారి మతమును ఉపన్యసించుచు, అట్టి మతము నిజముగా లేదుగాని, అట్లు భావించినను శోకింపఁదగదని చెప్పుచున్నాఁడు.
ఈ రెండు శ్లోకముల సారాంశము ఇది: ప్రపంచమందలి సమస్త వస్తువులు నిత్యమును మారుచుండుటవలన, ఒక రూపమును విడిచి మఱియొక రూపమును స్వీకరించుచుండును. ఇందు పూర్వరూపమును విడుచుటయే మరణము; నూతనరూపమును ధరించుటయే జన్మము. అట్లగుట, ఎవఁడు జన్మించినాడో వాఁడు మరణించును; ఎవఁడు మరణించినాడో వాఁడు జన్మించును — ఈ ప్రవాహము నిత్యముగా సాగుచుండును. ఈ దృష్టితో చూచినను శోకించుట ఎందులకు?
సందర్భము: పూర్వద్వయశ్లోకములలో పర్యాయమతమును ప్రదర్శించిన భగవంతుఁడు, ఇప్పుడు తరువాతి శ్లోకములో సర్వసామాన్య దృష్టితో మాట్లాడుచున్నాఁడు.
★🔗